Thursday, October 8, 2015

మన కాకినాడ

సముద్రపువొడ్డున ఉన్న పల్లె లాంటి పట్నం, పట్నం లాంటి పల్లె. అక్కడక్కడా నీటికొలనులు. వాటినిండా ఎర్ర తామర పువ్వులు. బాలాజీ చెరువు, సంతచెరువు, పిండాలచెరువు, కుళాయి చెరువు, ఇంకా చాలా చెరువులు వాటిపేర్లు కూడా మనకు తెలియకుండా కప్పెట్టేసినవి... ఈ ప్రదేశమంతా జలకళతో, ఎర్ర తామర పువ్వులతో చిత్రకారుడు గీసిన వాటర్ పెయింట్‌లా ఎంత బాగుండేదో! ఒక్కసారి ఊహించుకోండి. ఎర్రతామరపువ్వులని తెలుగులో కోకనందములు అంటారట. అందుకే ఈ ప్రదేశాన్ని కోకనందవాడ అని పిలిచేవారట, క్రమంగా అదే కాకినాడ అయ్యింది. ఈ కథ ప్రకారం కాకినాడ పదహారణాల తెలుగు పట్టణమన్నమాట.  ఆగండాగండి....అలాగని ఫిక్సయిపోకండి. ఇంకొక కథ ఉంది. భారతదేశానికి యూరోపియన్లు వస్తున్న క్రమంలో తీరప్రాంతంలో ఉన్నకారణంగా ఫ్రాన్స్ నుంచి, ఇంగ్లాండ్‌నుంచి, కెనడా నుంచి.... వ్యాపార, ఉద్యోగ విషయమై ఇక్కడ చాలామంది సెటిలయ్యరు. వాళ్ళల్లో కెనడా వాళ్ళకి వారిదేశపు పోలికలు ఈ ఊరిలో చాలా కనిపించి, తెగ నాస్టాల్జిక్  గా ఫీలయిపోయి కో-కెనడా అని పిలుచుకొంటూ అదే ఖాయం చేసేశారట. కెనడా వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు అని చెప్పడానికి ఒక చారిత్రక ఆధారం కూడా ఉంది. అదే, సరిగ్గా వందసంవత్సరాల క్రితం ఒక కెనడా దేశస్తుడు జాన్ మెక్లారిన్ స్థాపించిన ప్రతిష్టాత్మకమైన మెక్లారిన్ హైస్కూల్. భారతదేశ రాష్ట్రపతిగా చేసిన వరహాగిరి వెంకట గిరి (వి.వి.గిరి), కేంద్రమంత్రిగా పనిచేసిన మంగపతి సంజీవరావుగారు, సినిమాలలో హాస్యపాత్రలు పోషించే గౌతంరాజు, `మనిసన్నాకా కూసoత కలాపోసన ఉండాల`ని డైలాగులతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన రావుగోపాలరావు, నటవిస్వరూపం యస్వీరంగారావులవంటి ఎందరో ఇక్కడే చదువుకొన్నారు.  రేపే (23.11.2012) మెక్లారిన్ హైస్కూల్ వాళ్ళు వందసంవత్సరాల పండుగ జరుపుకొంటున్నారు.

స్కులు గురించి చెప్పుకొంటున్నాం కనుక ఇంకొక్క రెండుముక్కలు - ఏంటంటే, పిఠాపురం రాజా (పి.ఆర్) కళాశాల, మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్, రంగరాయా మెడికల్ కాలేజ్, జె.ఎన్.టీ.యూ ఇంజనీరింగ్‌కాలేజ్(ఈ మధ్యనే యూనివర్సిటిగా మార్చారు), ఆసియాలోనే మొట్టమొదటి మహిళా పోలిటెక్నిక్ కాలేజ్- జీ.పీ.టీ, ఆంద్రా పోలిటెక్నిక్, ఆంద్రా యూనివర్సిటీ ఎక్స్‌టెన్షన్ సెంటర్....లాంటి విద్యాసంస్థలు ఎప్పటినుంచో సేవలు అందిస్తున్నాయి. 
*  *  *

సముద్రతీర ప్రాంతం కాబట్టి,  పడవల తయారీ పరిశ్రమ ఇక్కడ ఉంది. కొంతకాలం క్రితం ద హిందూ న్యూస్ పేపర్లో దీని గురించి రాస్తూ 6000 సంవత్సరాల క్రితంనాటి సాంప్రదాయక పడవల తయారీ విధానం ఇంకా కాకినాడలో కొనసాగుతుందని సోదాహరణంగా చెప్పారు. గుజరాత్లో లోథాల్ అనే ప్రాంతంలో జరిపిన పురావస్తుశాఖ తవ్వకాల్లో హరప్పా నాగరికతకు సంబంధించిన చాలా అవశేషాల్లు బయటపడ్డాయి. వాటిల్లో 710అడుగుల పొడవు, 120అడుగుల వెడల్పూగల అతిపెద్ద పడవలు ఉన్నాయి. వీటిని తయారుచేసే విధానం గురించి ప్రాచీన గ్రంధాలయిన యుక్తి కల్పతరు, ఋగ్వేదం, సమరాంగణ సూత్రధార, కౌటిల్యుని అర్థశాస్త్రం మొదలైన వాటిల్లో రాసి ఉందట. ఇప్పుడు కాకినాడలో తయారు చేస్తున్న పడవలు అచ్చంగా అలాగే ఉంటున్నాయట. బోటు తయారీ దారులు తమకు ఈ విద్య తమ తాతల తాతలు నుంచి వంశపారంపర్యంగా పస్తుందని చెప్తారు. ఎక్కడోఉన్న గుజరాత్‌ని కాకినాడకి ఏదో రకంగా ముడిపెట్టి ఈ ఊరికి చారిత్రక ప్రాధాన్యం కలిగించడానికి కాదుకానీ ఒక పరంపర అప్రతిహతంగా కొనసాగుతున్న ఆనవాళ్ళు ఇక్కడ కనిపించడం చూస్తుంటే ఆనందంగా ఉండదూ?

No comments:

Post a Comment